‘‘రాష్ట్రంలో రెడ్ టేపిజం లేదు. కానీ, ఆ స్థానంలో రెడ్డి ఇజం వచ్చింది. అది మంచిదికాదు. దయచేసి గుర్తు పెట్టుకోండి’’ అని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణమరాజు సీఎం జగన్మోహన్ రెడ్డికి సూచించారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్నత పదవులన్నీ సీఎం తన సొంత సామాజిక వర్గానికి కట్టబెడుతున్నారని విమర్శించారు. నిత్యం ఎవరో ఒక రెడ్డికి పదవి కట్టబెడుతూనే ఉన్నారని, దీంతో ప్రజలు ‘హే మళ్లీ ఏసేశాడు’ అన్న డైలాగును గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. ‘ఇదిగో ఆ నియామకాల జాబితా’ అంటూ ఒక కాగితాల కట్ట చూపించారు. ‘‘ఉదాహరణకు కొన్ని నియామకాలు చెబుతాను. ప్రభుత్వ విప్లుగా గడికోట శ్రీకాంత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కాపు రామచంద్రా రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి! ఒకే కులం నుంచి ఇంత మంది విప్లా? ఇక… సీఎం కార్యాలయంలో కల్లం అజేయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, నాగేశ్వర రెడ్డి, ధనుంజయ రెడ్డి! టీటీడీ బోర్డు చైర్మన్గా వైవీ సుబ్బారెడ్డిని నియమించారు.అదే బోర్డులు… వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, మేడా మల్లికార్జున రెడ్డి, పుట్టా ప్రతాప్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి! పీపీఏ రివ్యూపై కమిటీని నియమిస్తే… అందులోనూ రాజేంద్రనాథ రెడ్డి, శ్రీనివాస రెడ్డి, అజయ్ రెడ్డి, గోపాల రెడ్డి! ఇక… వైస్ చాన్స్లర్లు అదే కులం నుంచి లెక్కలేనంత మందిని నియమించారు.
ప్రెస్ అకాడమీ చైర్మన్గా దేవిరెడ్డి శ్రీనాథ రెడి! ఇలా ఎంతమంది? వేరే కులాల వారు లేరా? ఆస్తిపాస్తుల్లో.. ఆస్తి నాకు, పాస్తి నీకు అన్నట్లు రెండు పదవులుంటే కీలకమైనది రెడ్డికి, ప్యూన్లాంటిది ఏ బీసీకో ఇతర కులాలకో ఇస్తున్నారు’’ అని రఘురామ కృష్ణరాజు విమర్శించారు.ఇది ప్రజలు అనుకుంటున్న మాట అని చెప్పారు. ‘‘హిందూ మతంలో కులాలు ఉన్నాయి. కానీ, కులాలులేని క్రైస్తవ మతంలో జగన్ ఉన్నారు. కులరహిత మతంలో ఉండి కూడా మీ పేరు చివరున్న రెండు అక్షరాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. కులాలకు అతీతంగా పని చేస్తారని ప్రజలు అనుకున్నారు. కానీ, జరుగుతున్నది పూర్తి విరుద్ధం’’ అని తెలిపారు. అదే సమయంలో… రెడ్లు అంటే తనకు ఎంతో గౌరవమని రఘురామ కృష్ణంరాజు చెప్పారు.వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్గా ఉన్న గుర్రంపాటి దేవేందర్ రెడ్డికి జగన్ ప్రభుత్వంలో డిజిటల్ మీడియా పదవి ఇచ్చారని రఘురామ తెలిపారు. దేవేందర్ రెడ్డి తన విగ్గుపైనా, తనపైనా సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలను చదివి వినిపిస్తూ… తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ వ్యక్తులకు ప్రభుత్వ పదవులు ఇస్తారా… పార్టీకీ, ప్రభుత్వానికీ తేడా ఉందా లేదా అని ప్రశ్నించారు. ‘‘నేను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాస్తే… అది ఎవరు రాశారో, ఎక్కడి నుంచి వచ్చిందో విచారణ చేస్తామంటూ మాట్లాడే దమ్ము, ధైర్యం గుర్రంపాటి దేవేందర్ రెడ్డికి ఎలా వచ్చింది? మాస్కులు లేవని ప్రశ్నించిన డాక్టర్ సుధాకర్పై పిచ్చోడి ముద్ర వేశారు. ఆయన దళితుడనే చర్యలు తీసుకున్నారా? దేవేందర్ రెడ్డిపై 48 గంటల్లో చర్యలు తీసుకోకపోతే… పార్లమెంటులో, లోకాయుక్తలో ఫిర్యాదు చేస్తా’’ అని హెచ్చరించారు. ‘‘అమరావతి గురించి మాట్లాడే హక్కు నాకుంది. నేను పుట్టిందీ, పెరిగిందీ విజయవాడలోనే.
రాజధానిని వేరేచోటికి తరలిస్తూ, భూములిచ్చిన రైతులకు అన్యాయం చేస్తే… బాధ్యతగల ఎంపీగా, ఒక పౌరునిగా ప్రశ్నిస్తూనే ఉంటా’’ అని రఘురామ స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఆమోదంతో ఏపీ పునర్విభజన చట్టం అమలులోకి వచ్చాక, మళ్లీ గవర్నర్ రాజధాని మార్పుకోసం ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులను ఆమోదించడం… రాష్ట్రపతి నిర్ణయాన్ని ధిక్కరించడమే అవుతుందని వివరించారు. కొత్త చట్టం చెల్లదని, ఏపీ రాజధానిగా అమరావతే కొనసాగి తీరుతుందని ప్రగాఢంగా నమ్ముతున్నానని తెలిపారు. రైతులకు న్యాయం జరుగుతుందన్నారు.