నిజంగా రాజకీయాలు ఏప్పుడు ఓకేలా వుండవు అని కోన్ని ఉదాహరణలు చూస్తే వేంటనే అర్థం అవుతుంది. ఒక్కప్పుడు బాగా రాజకీయం చేసిన వాళ్ళు తర్వాత కనుమరుగు అవ్వడం చూసాం. ఏవరీ ప్రాంతానికి వారే కీలకనాయకులుగా వ్యవహరించిన వారే ఇప్పుడు చాలా మంది అసలు ఇప్పుడు కనిపించడం లేదు. ఇంకా ఇలాంటివి చాలా వున్నాయి. ఇప్పుడు ఇది వీళ్ళకు కరేక్ట్ గా సరిపొతుంది.ఒకప్పుడు నలుగురుకి అవకాశాలు ఇచ్చిన వారు ఇప్పుడు ఇలా కావాలసి వచ్చింది అని అందరు అనుకుంటున్నారు.ఒకప్పుడు ఆయన జిల్లా రాజకీయాలతోపాటు రాష్ట్ర రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా వ్యవహరించారు. ప్రతి రాజకీయ సందర్భంలో ఆయన పాత్ర స్పష్టంగా కనిపించేది. “బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు” అవుతాయన్న చందంగా ప్రస్తుతం ఆయన ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. దీంతో నియోజకవర్గానికే దూరంగా ఉంటున్నారు. గతంలో ఇతరులకు దిశానిర్దేశం చేసిన ఆయన ఇప్పుడు తన రాజకీయ భవితవ్యంపైనే ఒకింత ఆందోళన చెందుతున్నారు. ఆయన సహచరి బీజేపీలో కొనసాగటం.. వైసీపీని దొరికిన చోటల్లా ఎండగట్టడాన్ని జీర్ణించుకోలేని ఆ పార్టీ అధిష్టానం “మీ ధర్మపత్ని కమలం పార్టీకి గుడ్బై చెప్పాల్సిందే..” అని అల్టిమేటం ఇచ్చిందట. ఇంతకీ ఆ నేత ఎవరు? ఆయన అడుగులు ఎటు పడబోతున్నాయి? వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
“పొమ్మనలేక పొగబెట్టినట్టు..” అని ఓ లోకోక్తి ఉంది. పర్చూరు నియోజకవర్గ వైసీపీలో ప్రస్తుతం ఓ ముఖ్యనేతకి పొగబెడుతున్నట్టుగా సంకేతాలు అందుతున్నాయి. వివరాలు తెలియాలంటే కొంత నేపథ్యంలోకి వెళ్లాలి. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరి.. రాజకీయ దిగ్గజాలైన ఈ దంపతులు తెలుగువారందరికీ సుపరిచితులు. గత సాధారణ ఎన్నికల్లో ప్రకాశం జిల్లా పర్చూరు అసెంబ్లీ స్థానం నుంచి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆయన సహచరి, బీజేపీ నాయకురాలు పురంధేశ్వరిని విశాఖపట్టణం లోక్సభ స్థానం నుంచి పోటీచేయాలని కమలంపార్టీ హైకమాండ్ ఆదేశించింది. ఈ తరుణంలో విజయసాయిరెడ్డితో మంతనాలు జరిపిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ నేతల అనుమతితో విశాఖ పార్లమెంట్ స్థానంలో పురంధేశ్వరిని పోటీకి దించారు. దంపతులు ఇద్దరూ చేరొక పార్టీ నుంచి పోటీచేయడంపై అప్పట్లోనే గుసగుసలు వినిపించాయి. ఆ ఎన్నికల్లో పర్చూరులో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఓటమి పాలయ్యారు.ఆ తర్వాత కొద్దిరోజులకు ముఖ్యమంత్రి జగన్ను దగ్గుబాటి కలవగా.. పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగాలని సూచించారు. నియోజకవర్గంలో దగ్గుబాటి, ఆయన కుమారుడు హితేష్ చెంచురామ్ విస్తృతంగా పర్యటించారు. క్షేత్రస్థాయిలో పార్టీ వ్యవహారాలపై పట్టు సాధించారు. ఇదిలా ఉంటే.. బీజేపీ తన రాజకీయ వైఖరి మార్చుకొని రాష్ట్రప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో బీజేపీ ముఖ్యనేతగా ఉన్న పురంధేశ్వరి కూడా తమ పార్టీ విధానాలకు అనుగుణంగా వైసీపీని ఎండగడుతున్నారు. ఫలితంగా రాష్ట్ర రాజకీయం మరింత వేడెక్కింది. ఈ పరిస్థితుల్లోనే అసలు పర్చూరు నియోజకవర్గంలో పార్టీ పరిస్ధితి ఎలా ఉందో.. దగ్గుబాటి వైఖరి ఏంటో తెలుసుకోవాలని వైసీపీ అధినేత జగన్ జిల్లా నాయకులను ఆదేశించారు. దీంతో జిల్లాకు చెందిన మంత్రి బాలినేని, అటు బాపట్ల లోక్సభ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మరో మంత్రి మోపిదేవి వెంకటరమణ పర్చూరు వ్యవహారాల్లో జోక్యంచేసుకోవడం ప్రారంభించారు.
తాజా పరిణామాలను దగ్గుబాటి వెంటనే పసిగట్టారు. ముఖ్యమంత్రి జగన్ను కలిసి మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. గత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంలోనే సీఎంను కలిసేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే జగన్ అపాయింట్మెంట్ లభించలేదు. అంతేకాదు- మొన్నటి ఎన్నికలకు ముందు పార్టీపై అలిగి వైసీపీకి గుడ్బై చెప్పి టీడీపీలో చేరిన పర్చూరు నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జి రావి రామనాథంబాబును ఇటీవలే సొంత గూటికి తీసుకొచ్చారు. సాక్షాత్తూ సీఎం జగన్ సమక్షంలోనే రామనాథంబాబు పార్టీలో చేరారు. జిల్లాకు చెందిన మంత్రి బాలినేని, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, వైసీపీ జిల్లా పరిశీలకుడైన రాష్ట్రప్రభుత్వ ప్రజాసంబంధాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు.రామనాథంబాబు చేరిక గురించి దగ్గుబాటికి కనీస సమాచారం ఇవ్వలేదట. దీంతో విస్మయానికి గురైన ఆయన నియోజకవర్గానికి రావడం మానేసి.. సీఎం జగన్ని కలిసే ప్రయత్నాలు మరింత ముమ్మరం చేశారట.. అయినప్పటికీ జగన్ దర్శనభాగ్యం ఆయనకు లభించలేదు. దీంతో విజయసాయిరెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేశారట. ఆయన ఒక్కసారి ఫోన్లో క్లుప్తంగా మాట్లాడినట్టు పార్టీ వర్గాల కథనం. ఆ తర్వాత వైసీపీ అధిష్టానం నుంచి డాక్టర్ దగ్గుబాటికి ఎలాంటి సానుకూల స్పందన రాలేదట. దీనికితోడు.. నియోజకవర్గంలో తిరిగి పార్టీలో చేరిన రామనాథంబాబు చెప్పిన పనులు చేయాలంటూ మంత్రి మోపిదేవితోపాటు మరికొందరు ముఖ్య నేతల నుంచి జిల్లా అధికారులకు వర్తమానం అందిందట! ఇదే అదనుగా నియోజకవర్గంలోని పాత వైసీపీ నాయకులంతా రామనాథంబాబు వెంట తిరగడం ప్రారంభించారట.
జరుగుతున్న ఘటనలతో దగ్గుబాటి తీవ్ర మనస్థాపానికి గురయ్యారట. “తాను చేసిన తప్పేంటనీ.. తన విషయంలో ఎందుకు పక్షపాతం చూపుతున్నారో తెలపాలనీ.. నియోజకవర్గ బాధ్యతలు చూసుకోవాలా?.. లేక పార్టీనుంచి వైదొలగాలా? అన్న విషయాలను స్పష్టంచేయాలనీ కోరుతూ విజయసాయిరెడ్డికి ఆయన ఒక లేఖ రాసినట్లు వినికిడి. అయితే ఆ లేఖకూ స్పందన లేదట.. దీంతో.. ముఖ్యమంత్రి జగన్ ఆలోచనలకు అనుగుణంగానే వైసీపీ అధిష్టానం దగ్గుబాటి విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని పరిశీలకుల అభిప్రాయపడుతున్నారు. బీజేపీ నేతగా ఉన్న పురంధేశ్వరి వైసీపీ ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ చేస్తున్న ప్రకటనలను సీఎం జగన్ సీరియస్గా తీసుకున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని జిల్లాతో సంబంధం ఉన్న ముఖ్యనేతల వద్ద జగన్ ప్రస్తావించారట. అంతేకాకుండా పురంధేశ్వరి బీజేపీకి రాజీనామా చేయవచ్చు కదా? అని దగ్గుబాటికి అంతర్గతంగా ఓ సూచన కూడా పంపారట. పురంధేశ్వరి వైదొలుగుతానంటే బీజేపీ పెద్దలు అంగీకరించడం లేదని దగ్గుబాటి సమాధానం ఇచ్చారట. నిజానికి ఇలాంటి చర్చలన్నీ వైసీపీలో తాను చేరిన కొత్తలో జరిగాయనీ, ఇప్పుడు మాత్రం జగన్ తనకు కలిసే అవకాశం ఇవ్వడం లేదనీ దగ్గుబాటి తన సన్నిహితులతో చెప్పి వాపోతున్నారట. పరిస్థితులు క్రమంగా వికటిస్తుండటంతో.. దగ్గుబాటి అనుచరులు కొందరు జోక్యం చేసుకున్నారు. జిల్లాకు చెందిన విద్యుత్శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో దగ్గుబాటి, ఆయన కుమారుడు హితేష్ చెంచురామ్ కలిసే ఏర్పాటుచేశారు. ఇటీవల వీరిమధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. వైసీపీలోకి రామనాథంబాబును తీసుకోవడం పార్టీ విధాన నిర్ణయమని చెప్పి.. “మీ పని మీరు చేసుకోండి..” అని మంత్రి బాలినేని దగ్గుబాటికి సూచించినట్టు సమాచారం. ఈ సందర్బంగా దగ్గుబాటి “ఒకసారి ముఖ్యమంత్రి జగన్తో మాట్లాడించమని” బాలినేనిని కోరారట. సీఎం జగన్ను కలిసిన తర్వాతే నియోజకవర్గానికి వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే తాజాగా ఎన్నో ప్రయత్నాలు చేసిన మీదట దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి సీఎం జగన్ అపాయింట్మెంట్ లభించింది. ఈ భేటీలో కూడా పురంధేశ్వరి అంశమే ప్రధానంగా చర్చకి వచ్చిందట. బీజేపీ నుంచి ఆమె తప్పుకోవాల్సిందేనని దగ్గుబాటికి జగన్ అల్టిమేటం ఇచ్చారట. అలా చేస్తే పర్చూరు నియోజకవర్గంలో సమస్యలన్నీ సర్దుబాటు అవుతాయనీ, దగ్గుబాటితోపాటు ఆయన కుమారుడు హితేష్ చెంచురామ్ రాజకీయ భవిష్యత్తుకి కూడా ఢోకా ఉండదనీ సీఎం జగన్ స్పష్టంచేశారట. భార్యాభర్తలు ఇద్దరు వేరువేరు పార్టీల్లో ఉండటం పట్ల జగన్ అయిష్టం వ్యక్తంచేశారట. ప్రస్తుతం పురంధేశ్వరి అమెరికాలో ఉన్నారనీ, ఆమె తిరిగి రాగానే మాట్లాడి తమ నిర్ణయం తెలియజేస్తాననీ జగన్తో దగ్గుబాటి చెప్పారట. అయితే ఈ విషయం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ముడిపడి ఉన్నరీత్యా అంత తేలిక కాదన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఈ అంశమే ఇప్పుడు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు దంపతుల అడుగులు ఎటు పడతాయో వేచి చూద్దాం.